కలం, వెబ్ డెస్క్ : మొయినాబాద్ ఫాంహౌజ్ డ్రగ్స్ (Moinabad Drugs Case) ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి ఈ డ్రగ్స్ను సిమ్లాలో కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. రోహిత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు శరత్ కుమార్ అందించిన కీలక సమాచారం ఆధారంగా పోలీసులు కౌశిక్ రవిని విచారించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరా, పంపిణీకి సంబంధించిన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల కథనం ప్రకారం.. శరత్ కుమార్ ఈ డ్రగ్స్ను రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద దాచినట్లు తెలుస్తోంది. గత రాత్రి జరిగిన పార్టీలో శరత్ కుమార్ స్వయంగా అక్కడికి వచ్చిన వారందరికీ డ్రగ్స్ పంపిణీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పార్టీ అనంతరం మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉందని గుర్తించిన పోలీసులు, అతని నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

