కలం, నల్లగొండ బ్యూరో : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మంగళవారం నకిరేకల్ (Nakrekal) మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు ప్రజల సౌకర్యార్థం రూ.20 లక్షలతో నిర్మించనున్న ప్రజా మరుగుదొడ్ల పనులకు సైతం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. ఖజానాను ఖాళీ చేయడం తప్ప పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిజమైన ప్రజా పాలన ప్రారంభమైందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఇళ్ళు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు అందజేస్తామని స్పష్టం చేశారు. నకిరేకల్ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇక కేరళం ఎన్నికలలో కాంగ్రెస్ సాధించిన విజయంపై స్పందిస్తూ, ఇది రాహుల్ గాంధీ నాయకత్వానికి నిదర్శనమని, అలాగే ఇందులో సగం క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డికీ దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

