కలం, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నీటి బొట్టు వెనుక వైఎస్సార్ (YSR) ముద్ర ఉన్నదని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతా రెడ్డి తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీ ప్రగతిని వైఎస్సార్ పాలనకు ముందు, ఆ తర్వాత అని గర్వంగా చెప్పుకునేలా ఆయన సంక్షేమ, అభివృద్ధిలో విప్లవం సృష్టించారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి చారిత్రాత్మక పథకాలతో ఆయన కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్, ఆ తర్వాత వైయస్ జగన్ హయాంలో శరవేగంగా పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల ఘనతను నేడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వెలిగొండ వంటి ప్రాజెక్టులను ఎగతాళి చేసిన చరిత్ర చంద్రబాబుదైతే, కరువు నేలలను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్సార్దేనని సజ్జల స్పష్టం చేశారు. పేదవాడి కన్నీరు తుడిచిన ఆ మహనీయుని ఆశయాలు సజీవంగా నిలవాలంటే, రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగం రావాలంటే జగన్ను మళ్లీ సీఎం చేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

