కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ (Narayankhed) నియోజకవర్గం నల్లవాగు ప్రాజెక్ట్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. ప్రాజెక్ట్ అలుగు ద్వారా నీరు వృథాగా పోకుండా, నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేశారు. ఈ మేరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎడమ, కుడి కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నల్లవాగు ప్రాజెక్ట్లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున, రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతాంగానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలువల ద్వారా సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

