కలం, నిర్మల్: భైంసా (Bhainsa) పట్టణంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని (Har Ghar Tiranga Rally) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. యువత పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జాతీయ జెండా ఔన్నత్యాన్ని, దేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యత భావాలను ప్రజలలో మరింతగా పెంపొందించాలని కోరారు.

