కలం, మెదక్ బ్యూరో : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి అందరూ పని చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) అన్నారు. పటాన్ చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో రూ.15 కోట్ల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) చెప్పారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడిన జిన్నారం, గుమ్మడి దల, గడ్డ పోతారం తొలి పాలకవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడాలని.. తదనంతరం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ.. మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రత్యేకగా తీర్చిదిద్దాలని విన్నవించారు. అభివృద్ధి పనులు.. సమస్యల పరిష్కార అంశంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.


