కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ పేరును “కొత్తగూడెం – పాల్వంచ (Kothagudem-Palwancha) మున్సిపల్ కార్పోరేషన్” గా మార్చాలని కోరుతూ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేసి కార్పోరేషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నూతన కార్పోరేషన్కు కేవలం కొత్తగూడెం పేరు మాత్రమే ఉందని, పాల్వంచ పేరు చేర్చాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. వారి మనోభావాలను గౌరవిస్తూ పేరు మార్చాలని ఎమ్మెల్యే కోరారు.
పాల్వంచకు ఘనమైన చరిత్ర ఉందని, గతంలో ఇది ఒక సంస్థానంగా, ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా విరాజిల్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాల్వంచ పేరును కార్పోరేషన్ లో చేర్చడం ద్వారా ఆ ప్రాంత గౌరవాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడినట్లవుతుందని కూనంనేని పేర్కొన్నారు. కార్పోరేషన్ పేరు మార్పు విషయంలో పాల్వంచ ప్రజల కోరిక అత్యంత సమంజసమని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరితగతిన ‘కొత్తగూడెం-పాల్వంచ (Kothagudem-Palwancha) మున్సిపల్ కార్పోరేషన్ ’గా అధికారిక ప్రకటన వెలువడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతూ పంపిన లేఖలో ఆయన వివరించారు.

