కలం, నిర్మల్: నిర్మల్(Nirmal)జిల్లా కేంద్రంలో కొండాపూర్ బైపాస్ నుంచి శివాజీ చౌక్ (మంచిర్యాల చౌరస్తా) వరకు రూ.13 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ (Road Expansion), అభివృద్ధి పనులకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మల్ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కొండాపూర్ బైపాస్ నుంచి శివాజీ చౌక్ వరకు ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పట్టణంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. డ్రైనేజీ సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, కౌన్సిలర్లు గంజి రాజు, సూరి, విఠల్, నరేష్, శశాంక్, నాయకులు జుట్టు దినేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

