కలం, వెబ్ డెస్క్ : దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ (Delimitation) అంశం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన ప్రతులను బహిరంగంగా తగులబెట్టిన ఆయన, ఈ మంటలు భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని దహించివేస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆందోళనను ఆయన ఈ సందర్భంగా మరోసారి వ్యక్తపరిచారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా నేడు లోక్సభ ముందుకు రానుంది. ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభ స్థానాల సంఖ్యను ఏకంగా 850కి పెంచే దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటాను కల్పించే కీలక బిల్లుపై కూడా సభలో చర్చ జరగనుంది. ఒకవైపు ప్రభుత్వ వ్యూహాలు, మరోవైపు విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్ వాతావరణం ఉత్కంఠభరితంగా మారనుంది.

