కలం, తెలంగాణ బ్యూరో : సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ప్రస్తుత రబీ పంటలకు అందించడంలో పూర్తి బాధ్యత ఇంజినీర్లదేనని, ఎక్కడ తేడాలు వచ్చినా వారే జవాబుదారీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని చివరి దశలో ఉన్న రబీ పంటలకు అందించడంపై పకడ్బందీ ప్లాన్ చేయాలన్నారు. ఎక్కడా పంటలకు సాగునీరు లేదనే ఫిర్యాదులు రావద్దని, పంటలు ఎండిపోవద్దని నొక్కిచెప్పారు. సమర్ధవంతంగా నీటి వినియోగంపై ఫోకస్ పెట్టాలన్నారు. పంటలు ఎండిపోకుండా చూడడమే కాకుండా ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట మెకానిజం రూపొందించాలన్నారు. అదే సమయంలో చెరువులు, రిజర్వాయర్లలో పూడికతీత (డీసిల్టింగ్) పనులు చేపట్టాలని, డీసెడిమెంటేషన్ ప్రోగ్రామ్ కూడా చేపట్టాలన్నారు. ఇంజినీర్లతో హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయి పరిస్థితికి తగినట్లు నిర్ణయాలు :
సాగునీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనంలోకి తీసకుని తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని సుమారు ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీ సీజన్లో నీటి సరఫరా జరిగినందువల్లనే చాలా ప్రాంతాల్లో వరి పంట కోత పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకా నీటి అవసరం ఉన్నట్లయితే తప్పనిసరిగాఅందించాలని ఆదేశించారు. కాలువలు సీజన్ ముగింపుకంటే ముందే అన్ని ట్యాంకులను తాగునీటి అవసరాల కోసం నింపాలన్నారు. జూరాల ప్రాజెక్ట్ రిపేర్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో ఒకటిన్నర టీఎంసీ కంటే ఎక్కువే నీటి నిల్వ ఉన్నదని, నారాయణపూర్ నుంచి రీజెనరేటెడ్ వాటర్ రూపంలో మరో అర టీఎంసీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్లు వివరించారు.
రైతులకు పూడికతీత మట్టి సరఫరా :
రాష్ట్రంలోని ఏయే చెరువులు, రిజర్వాయర్లలోని తాజా స్టేటస్ను సేకరించి పూడికతీత పనులు ఎలా చేపట్టాలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించిన మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వీలైన చోట్ల ఆ మట్టిని రైతులకు ఇవ్వాలని, అది సాగుభూములకు ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని, అది సాధ్యంకాని చోట్ల వివరాలతో కూడిన ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. రిజర్వాయర్లలో పేరుకుపోయిన మట్టి కారణంగా నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతున్నదని, దాన్ని పూడికతీత పనుల ద్వారా పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ సర్వేల రిపోర్టులను ఉదహరించిన మంత్రి ఉత్తమ్ (Minister Uttam)… అనేక ప్రాజెక్టుల్లో 30–40% పూడిక పేరుకుపోయిందన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం కేంధ్ర సంస్థల అధ్యయనాలు, ఇన్వెస్టిగేషన్ల పురోగతిపై ఆరాతీశారు.
Read Also: బాసరకు కొత్త శోభ.. సర్కారు మాస్టర్ ప్లాన్
Follow Us On: X(Twitter)

