కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా హైదరాబాద్లో అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ పెట్టుబడులను సాధించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సురక్షితమైన వాతావరణం ఉన్నప్పుడే పెట్టుబడులు వెల్లువెత్తుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ (Hyderabad)లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మెరుగైన రవాణా వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యాధునిక సౌకర్యాల కల్పన ద్వారా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ది, గ్లోబల్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలుపుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


