కలం, ఖమ్మం బ్యూరో: హైద్రాబాద్ కంటే మిన్నగా ఖమ్మం అభివృద్ధి చెందేలా, మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం (Khammam) లోని 58వ డివిజన్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పరిశుభ్రతలో 3వ స్థానంలో ఉన్న ఖమ్మంను మొదటి స్థానంలో నిలిపేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. అందుకోసం నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఆదేశించారు. రింగ్ రోడ్డు పూర్తయ్యాక ఖమ్మంలో ట్రాఫిక్ కష్టాలు ఉండవన్నారు.
స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్త్రాలు
ఖమ్మం నగర నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి తుమ్మల పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగానికి కరువు కాటకాలు రాకుండా చూడాలని ఉగ్ర నరసింహ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని పార్కులో నూతనంగా ప్రతిష్టించిన ఏకశిల గరుడ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ పాతిమ జోహారా, మార్కెట్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

