కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి సీతక్క (Minister Seethakka), టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యాలయాల నిర్మాణం అవసరమని, నిజామాబాద్లో నిర్మిస్తున్న ఈ భవనం కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
ప్రజా పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత సేవలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. నిజామాబాద్లో కొత్త కార్యాలయం నిర్మాణం పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకువస్తుందని, కార్యకర్తల సమన్వయానికి ఇది కీలక కేంద్రంగా మారుతుందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

