కలం, వెబ్ డెస్క్ : భయం అంటే ఏంటో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చూపెట్టింది అని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గతంలో ఎవరి దగ్గరికైనా వెళ్లాలంటే ఫోన్ ఇంట్లో పెట్టి జాగ్రత్తగా రావాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో లేవని.. వేధింపులు, నిఘాకు ఆస్కారం లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరినైనా కలవాలంటే భయపడే పరిస్థితి ఉండేదని.. చాలా రోజులు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.
ప్రజలకు దూరంగా ఉంటే ఏ పార్టీ బతకదని బీఆర్ఎస్ ను ఉద్దేశించి విమర్శించారు. ప్రజలకు దూరమవుతున్నారనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారన్నారు. తాము సరిగ్గానే ఉన్నాం.. ప్రజలే మారాలని ఆలోచించడం సరైన పద్ధతి కాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. అలాగే, కల్వకుంట్ల కుటుంబంలోని లోపాలను కవిత బయట పెడుతున్నారన్నారు. పార్టీ అంటే కుంటుంబమే అనే రీతిలో బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారని దుయ్యబట్టారు. టీజేెఎస్ పార్టీకి ప్రభుత్వంలో భాగస్వామ్యంతో పాటు నామినేటెడ్ పోస్టులు కావాలని కోరుతున్నామన్నారు. తనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిపై ఎలాంటి హామీ ఇవ్వలేదని.. తాను కూడా అడగలేదని కోదండరాం వెల్లడించారు.

