కలం, వెబ్ డెస్క్: మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. పార్లమెంట్లో తెలంగాణ విభజనను భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఒక ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగిందని లేఖలో పేర్కొన్నారు. దీనిని భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ పవిత్రతను తగ్గించడమే కాక, తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక, రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజా శాంతి, సామరస్యాలను కాపాడటానికి, ఈ విషయాన్ని పరిశీలించి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

