కలం, కరీంనగర్ బ్యూరో: వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సోమవారం ఉదయం కర్నూలు నుండి వనపర్తికి వెళ్తుండగా రంగాపూర్ సమీపంలో జాతీయ రహదారి-44 పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసిందని, వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులు, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వేగంగా స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.
ఈ ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ నిర్వహించి, పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్టీసీ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

