కలం, వెబ్ డెస్క్: వేసవి సెలవులు ముగించుకొని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ పథకాన్ని(Breakfast Scheme) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హైదరాబాద్లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందజేసి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.

