కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటమి భయమో లేదా ఏకగ్రీవానికి ప్రయత్నమో గానీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రెవెన్యూ మంత్రి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాలికి గజ్జె కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అంతకుముందే సీఎంతో ప్రచారం చేయించుకున్నారు. దాదాపు రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎంతోనే శంకుస్థాపన చేయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ స్థాయి ప్రచారం చూడలేదని స్థానికులు చెప్తున్నారు.
మంత్రి వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో తమ్ముడు ప్రసాద్ రెడ్డి, అల్లుడు దయాకర్ రెడ్డి ప్రచార కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగానే 15వ వార్డులో తమ్మినేని కోటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి సీపీఏం అభ్యర్ధిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోటేశ్వరరావు తన భార్యతో నామినేషన్ను ఉపసంహరించడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆయనను సీపీఏం పార్టీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరో పక్క స్వయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) ప్రత్యర్థి పార్టీ వారికి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ఈ ఒక్కసారి నాకు సహాయం చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అని బతిమిలాడుతున్నారని కూడా స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటాం: భట్టి విక్రమార్క
Follow Us On : WhatsApp


