కలం, వెబ్ డెస్క్: గతంలో కేసీఆర్ హయాంలో బస్తాల్లో చీరలు కొనుక్కొచ్చి వాళ్లని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన చీరలు తయారు చేయించి ఆడబిడ్డలకు అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. శుక్రవారం నల్లగొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలపై (Indiramma Sarees) కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి క్వాలిటీతో కూడిన చీరలను ఆడబిడ్డలకు అందిస్తున్నామన్నారు. కేసీఆర్ బస్తాల్లో కొనుక్కొచ్చి ఇచ్చిన చీరలు ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసన్నారు. ఏ కలర్ చీర బాగుంటుందో, ఏ డిజైన్ అయితే బాగుంటుందో అని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో వారికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.900 నుంచి రూ.1000 వరకు ధర ఉండే చీరలు పంపిణీ చేశామన్నారు. మహిళలకు ఇంకా కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి (Komatireddy) సూచించారు. గత ప్రభుత్వం పదేళ్లలో మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో తప్పులు జరిగాయని స్వయంగా కేసీఆర్ బిడ్డనే చెప్తుందని మంత్రి తెలిపారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేయించారని కవిత చెప్తోందన్నారు. తెలంగాణ వస్తే పేదోళ్లు బాగుపడుతారనుకుంటే పదేళ్లు మోసం చేశారని ఆరోపించారు.
Read Also: నిజామాబాద్లో గెలుపు మనదే: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


