కలం, ఖమ్మం బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో భాగంగా అశ్వారావుపేటలో గురువారం నిర్వహించిన రోడ్షోలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను తుంగలో తొక్కిందని, కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన మండిపడ్డారు. “గత పాలకులు పేదవాడి ఆత్మగౌరవమైన ఇల్లు కట్టించడం కంటే, తమ జేబులు నింపుకోవడానికే మొగ్గు చూపారు. పేదలకు ఇళ్లు కట్టిస్తే కమీషన్లు రావని భావించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే వేల కోట్ల కమీషన్ల కోసమే ప్రాధాన్యం ఇచ్చారు” అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, అందులో అశ్వారావుపేటకే 4,500 ఇళ్లు కేటాయించినట్లు మంత్రి గుర్తుచేశారు.
“నాడు వరి వేస్తే ఉరే అన్న దొరల పాలన చూశాం.. నేడు రైతును రాజును చేస్తున్న ఇందిరమ్మ పాలన చూస్తున్నాం” అని మంత్రి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ (Crop Loan Waiver) చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు.
అశ్వారావుపేట అభివృద్ధిని విస్మరించినవారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి (Minister Ponguleti) హెచ్చరించారు. రూ. 230 కోట్లతో నియోజకవర్గాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికే తిరుగులేని విజయం అందించిన అశ్వారావుపేట (Aswaraopeta), ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనానికి నాంది పలకబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Also: ఎస్ఐఆర్కు ముందే బీఎల్ఏలను నియమించాలి : సీఈఓ సుదర్శన్ రెడ్డి
Follow Us On : WhatsApp


