కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం, విద్యా వ్యవస్థ బలోపేతంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం”(Thalliki Vandanam) పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం అమలులో ఎలాంటి జాప్యం లేకుండా విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు.
అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలలో నమ్మకం పెరిగేలా సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిర్వహించే 12 రకాల కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి, ఎలాంటి ఆలస్యం లేకుండా వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

