కలం, వెబ్ డెస్క్ : ముంబైలో ఎయిర్ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో సమావేశమయిన మంత్రి లోకేశ్(Nara Lokesh).. విశాఖపట్నంలో ఎయిర్ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ భేటీలో విశాఖపట్నంని డేటా సెంటర్ల హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు. సుమారు 6 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించేందుకు అనువైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఎయిర్ట్రంక్ సంస్థ విశాఖలో ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎయిర్ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదా సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విశాఖను టెక్నాలజీ, డేటా సెంటర్ల రంగంలో కీలక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

