కలం, ఆదిలాబాద్ బ్యూరో : ‘ఆదిలాబాద్ అభివృద్ధి దశ మారనుంది. పారిశ్రామిక వాడ (Adilabad Industrial Zone)ను ఏర్పాటు చేస్తాం. ప్రగతి పరుగులు పెట్టిస్తాం’ అన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. తాజాగా రాష్ట్ర సర్కార్ పారిశ్రామికవాడ భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అధికారులకు సిద్ధమవుతున్నారు. పారిశ్రామికవాడ వస్తే అభివృద్ధి చెందుతామని రైతులు మురిసిపోతున్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఎలాంటి పరిశ్రమలు లేవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. స్వయం ఉపాధి లేదు. అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెనాక – కోరాట బ్యారేజీని సందర్శించిన సందర్భంగా హామీ ఇచ్చారు. అదే సమయంలో నిర్మల్లో బహిరంగ సభలో దేశంలో అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
6 వేల ఎకరాలు గుర్తింపు
ముఖ్యమంత్రి హామీ మేరకు పారిశ్రామికవాడ (Adilabad Industrial Zone) నిర్మాణానికి ఇప్పటికే బోరజ్ మండలం హత్తిఘాట్, రాంపూర్, గూడ. గిమ్మ బి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. హత్తిఘాట్ లో 11 వందల ఎకరాలు, గిమ్మ, రాంపూర్, గూడాలలో 5 వేల ఎకరాలను గుర్తించారు. ఆయా భూములను పారిశ్రామికవాడ గుర్తించడమే కాకుండా.. భూ సేకరణకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి విడతలో 2 వేల ఎకరాలు సేకరిస్తామని అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ లో భూ సేకరణలో అభ్యంతరాలు, తప్పులుంటే స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని సరిదిద్దుతారు. పారిశ్రామికవాడకు సేకరించే భూములన్నీ సాగుకు యోగ్యంకానివి కావడం విశేషం.
భూములు ఇచ్చేందుకు సిద్ధమే..
పారిశ్రామికవాడ ఏర్పాటుపై స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బండల భూములు, సాగుకు యోగ్యంకాని భూముల్లో పారిశ్రామిక వాడ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు. పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి పారిశ్రామిక వాడ దోహదపడుతుందంటున్నారు. జిల్లా అభివృద్ధి దశ మారుతుందంటున్నారు. భూములు ఇవ్వడానికి తాము సిద్ధమంటున్నారు. కానీ పరిహారం చెల్లింపులో అన్యాయం చేయొద్దంటున్నారు. మంచి పరిహారం ఇచ్చి భూములు సేకరించాలని సర్కార్ ను రైతులు కోరుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామంటున్నారు. రైతుల నిర్ణయాన్ని అధికారులు కూడా అభినందిస్తున్నారు.

