కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (MG University) పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి డా. జి. ఉపేందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఏప్రిల్, మే 2026లో నిర్వహించిన యూజీ సెమిస్టర్ II, IV, VI రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలతోపాటు సెమిస్టర్ I, III, V బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.mguniversity.inలో చూసుకోవచ్చని ఆయన తెలిపారు.
సెమిస్టర్ల వారీగా ఉత్తీర్ణత వివరాలు చూస్తే.. మొదటి సెమిస్టర్లో 24.96 శాతం, రెండో సెమిస్టర్లో 32.49శాతం, మూడో సెమిస్టర్లో 32.66 శాతం, నాలుగో సెమిస్టర్లో 43.26 శాతం, ఐదో సెమిస్టర్లో 47.28 శాతం, ఆరో సెమిస్టర్లో 53.48 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షల్లో మొత్తం మీద రెండవ సెమిస్టర్లో అత్యధికంగా 9,170 మంది విద్యార్థులు హాజరు కాగా, వివిధ కారణాల వల్ల అందులో 787 మంది (8.58శాతం) విద్యార్థులు డిటెయిన్ అయ్యారు.
అలాగే నాల్గవ సెమిస్టర్లో 186 మంది (2.71శాతం) డిటెయిన్ అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. పరీక్షల్లో క్రమశిక్షణా రాహిత్యానికి (మాల్ ప్రాక్టీస్) పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు, ఆయా సెమిస్టర్లలో కలిపి మొత్తం 159 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు పరీక్షల విభాగం పేర్కొంది. ఫలితాల విడుదల కార్యక్రమంలో విశ్వవిద్యాలయ (MG University) రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు డా. లక్ష్మీప్రభ, డా. ప్రవళిక, డా. సంధ్యారాణి, డా. కళ్యాణి, డా. భిక్షమయ్య పాల్గొన్నారు.
Read Also: ప్రధాని మోదీకి సీజేపీ బహిరంగ లేఖ.. రేపటి నుంచి భారీ నిరసన!
Follow Us On: Instagram

