కలం, వెబ్ డెస్క్ : తన నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) స్పందించారు. గాంధీ భవన్ వేదికగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరును దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి, ఎన్నికల అధికారులు పూర్తిగా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనిపై మాట్లాడటానికి తనకు చాలా విషయాలు ఉన్నాయని, త్వరలోనే ప్రత్యేకంగా సమయం తీసుకుని, అందరినీ పిలిచి తన మనసులోని మాటలను పూర్తి వివరాలతో పంచుకుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎస్ఐఆర్ (SIR) సమావేశం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, అక్కడ మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి కేవలం ఇద్దరు రాజ్యసభ సభ్యులను గెలిపించుకోవడానికి మాత్రమే సరిపడా కోరం ఉందని, మూడో సీటును దక్కించుకోవడానికి మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి అవసరమని వివరించారు. అయినప్పటికీ, కేవలం దురుద్దేశాలతోనే మధ్యప్రదేశ్లో బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అభ్యర్థిని పూర్తిస్థాయిలో గెలిపించుకునే సంపూర్ణ కోరం ఉన్నప్పటికీ, తన అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. గతంలో హర్యానాలో సైతం బీజేపీ ఇదే తరహా కుట్ర రాజకీయాలకు పాల్పడిందని ఆమె గుర్తు చేశారు.
తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కేవలం ఒక నోటీస్ మాత్రమే వచ్చిందని మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) స్పష్టం చేశారు. నోటీస్ పెండింగ్లో ఉన్న అంశాన్ని నామినేషన్ పత్రాల్లో పొందుపరచాలనే నిబంధన ఎక్కడా లేదని, అయినప్పటికీ పెండింగ్ నోటీస్ ఉన్న విషయాన్ని తాను స్వయంగా రిటర్నింగ్ అధికారికి ముందే తెలియజేశానని చెప్పారు. తాను ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్గా బాధ్యతలు చేపట్టడానికి ముందే అది ఒక ప్రైవేట్ ఫిర్యాదు అని అధికారులకు స్పష్టం చేసినట్లు ఆమె వెల్లడించారు. మధ్యప్రదేశ్లో తాను ఎప్పుడూ చాలా తక్కువగా మాట్లాడతానని, కానీ ఈ అన్యాయంపై మాత్రం ఖచ్చితంగా గళం విప్పుతానని పునరుద్ఘాటించారు.

