కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో కోసం కేంద్రం సహకారం కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు (Ramchander Rao) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలపై ప్రశ్నించేందుకు తాను రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రాహుల్కు ఓ వినతి పత్రం సమర్పించాలని, ఆయన అపాయింట్మెంట్ అందేలా సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు. గత 2023 నవంబర్, డిసెంబర్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ స్వయంగా తుక్కుగూడ సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని రామచందర్ రావు అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా ఆ వాగ్దానాలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మహిళలు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం కోసం, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాగే, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 సాయం, కౌలు రైతులకు మద్దతు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం ఇంకా అందడం లేదన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తమకు ఇస్తామన్న రూ.4,000 ఆసరా పింఛన్ల పెంపు కోసం వేచి చూస్తున్నారని చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పరిస్థితి కూడా దయనీయంగా మారిందని రామచందర్ రావు (Ramchander Rao) ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా భరోసా కింద రూ.5 లక్షల సాయం అందకపోగా, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ పదే పదే హామీ ఇచ్చిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. అలాగే కాలేజీ అమ్మాయిలకు స్కూటర్ల పంపిణీ హామీ కూడా పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఈ ప్రజా సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు.
Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!
Follow Us On: Instagram

