కలం మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలతో కీలక విషయాలు చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి తీవ్ర నష్టం తప్పదంటున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 13 మున్సిపాలిటీలు ఉండగా.. తాజా ఎన్నికల్లో బీజేపీ ఒక్క మున్సిపాలిటీ కుడా గెలుచుకోలేకపోయింది. రఘునందన్ ఎమ్మెల్యేగా పనిచేసినా దుబ్బాకలో కూడా కేవలం రెండు వార్డులు మాత్రమే గెలిచింది. నర్సాపూర్ 4 , జిన్నారం 4 వార్డులు తప్ప పెద్దగా ప్రభావం చూపలేదు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress)కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్న బీజేపీ, సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి బీఅర్ఎస్తో పోత్తు పెట్టుకోవడంతో కమలం క్యాడర్ అయోమయంలో పడింది. ఏ ప్రయోజనం లేకుండా కాంగ్రెస్, బీఅర్ఎస్కు లబ్ధిచేకురేలా వ్యవహరించడంపై బీజేపీ కార్యకర్తలు షాక్ అవుతున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ సరైన ప్రయత్నం చేయలేదు. నర్సాపూర్లో మొత్తం 15 స్ధానాలకు గాను కాంగ్రెస్ 6, బీఅర్ఎస్ 5 , బీజేపీ 4 విజయం సాధించింది. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి. కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. అలాగే మెదక్ మున్సిపాలిటిలోనూ చైర్మన్ పీఠం దక్కించుకోలేకపోయింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ రఘునందన్ తీరుపై బీజేపీ (BJP) క్యాడర్ గుర్రుగా ఉంది. ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులుండగా బీజేపీ ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. కానీ ఇదే సమయంలో రఘునందన్ ఇస్నాపూర్లో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవడం విమర్శలకు దారితీసింది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న వ్యక్తి పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ హోదాలో మెదక్ జిల్లాలో పెద్దన్న పాత్రలో దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తే ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


