కలం, మెదక్ బ్యూరో: విద్యార్థులు, యువత సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, డిజిటల్ లావాదేవీల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని.. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ-మెయిల్స్, లింక్లను నమ్మవద్దని మెదక్ (Medak) జిల్లా అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట్ పట్టణ పరిధిలో విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి గోప్యమైన వివరాలను ఎవరికీ చెప్పకూడదని విద్యార్థులకు సూచించారు.
ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాప్తి పెరుగుతోందని, డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. డ్రగ్స్కు అలవాటు పడితే విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు ప్రమాదంలో పడతాయని అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ హెచ్చరించారు.

