కలం, ఖమ్మం బ్యూరో: భూ వివాదాలను చట్ట పరంగా, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప.. అర్ధరాత్రి పూట పేద రైతుల పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నల్లకుంటలో సర్వే నెంబర్ 273/1లో రైతులకు చెందిన భూముల్లో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు చొరబడి కొబ్బరి మొక్కలను నరికివేశారు.
విషయం తెలుసుకున్న మెచ్చా నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత గిరిజన రైతులు బొగ్గం శివ, మల్లా కమల, గోళ్ళ సీతారావమ్మ, గోళ్ళ వెంకటేశ్వర్లు, గట్ల సర్వేశ్వరరావు, జంగాల వెంకటేశ్వరరావుతో మాట్లాడారు. కళ్ల ముందే నరికివేసిన పంటను చూసి విలపిస్తున్న రైతులను ఓదార్చారు.
అక్రమ కేసులు పెట్టడం సరికాదు..
మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కష్టపడి సాగు చేసుకుంటున్న పేద, గిరిజన రైతులను బెదిరించడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. వివాదాలు ఉంటే దౌర్జన్యాలకు దిగడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి, భూ రికార్డుల ప్రకారం అసలైన బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఉప సర్పంచి దారా యుగంధర్, ముఖ్య నాయకులు అబ్దుల్ జిన్నా, గాజుబోయిన ఏసుబాబు, పాశం ప్రసాద్ పాల్గొన్నారు.

