కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పట్టణ పరిధిలోని జగిత్యాల రోడ్డులో ఉన్న విశ్వ బేకరీ (విశ్వ కేక్ జోన్)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (Vishwa Bakery) సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం బేకరీ లోపలి నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బేకరీ అంతటా వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ స్టేషన్కు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. బేకరీ (Vishwa Bakery) నివాస గృహాలు, వ్యాపార సముదాయాల మధ్య ఉండటంతో మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ప్రమాదంలో బేకరీలోని ఫర్నీచర్, ఎలక్ట్రికల్ పరికరాలు, తినుబండారాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. భారీ స్థాయిలో దాదాపు రూ.15 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బేకరీ నిర్వాహకులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : కేసీఆర్కు కాంగ్రెస్ షాక్.. మహా ధర్నాకు సిద్ధం!
Follow Us On: X(Twitter)

