కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రిలో(Rajahmundry) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగర మున్సిపాలిటీకి చెందిన బ్లీచింగ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోడౌన్లో నిల్వ ఉంచిన సుమారు 500 బస్తాల బ్లీచింగ్ అగ్నికి ఆహుతైనట్లు ప్రాథమిక సమాచారం.
పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం ఉపయోగించే బ్లీచింగ్ను ఇదే గోడౌన్ నుంచి రాజమండ్రి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. భారీగా నిల్వ ఉన్న రసాయన పదార్థాలు మంటలకు మరింత ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.

