కలం, ఖమ్మం బ్యూరో: అడవుల్లోని ఖనిజ సంపదను దోచుకుంటూ, ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని మావోయిస్టు సెంట్రల్ ఏరియా కమిటీ కార్యదర్శి దినేష్ పేరుతో భద్రాచలంలో గురువారం ఒక లేఖ (Maoist Letter) విడుదలవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివాసీలకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రేమ్ సాయి, జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా వైద్యం కోసం వచ్చిన ఆదివాసీలు మరణించారని, కాబట్టి వారికి మావోయిస్టు పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని లేఖలో హెచ్చరించారు.
మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మా మరణానికి కారణమైన నల్లపు దుర్గాప్రసాద్కే శిక్ష వేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేస్తారని జస్వంత్ వర్గీయులు అనుకుంటున్నారేమో.. మావోయిస్టులకు ద్రోహం చేసిన వారికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని లేఖలో పేర్కొన్నారు. జస్వంత్, ప్రేమ్ సాయి మావోయిస్టు పార్టీ సభ్యుల వివరాలు అడిగి అమాయకులైన ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తమకు సమాచారం ఉందని తెలిపారు. ‘ఖబడ్దార్ జస్వంత్ అండ్ ప్రేమ్ సాయి.. మీకు గట్టి సమాధానం లభిస్తుంది’ అని లేఖ (Maoist Letter) ద్వారా హెచ్చరించారు.
మావోయిస్టులందరూ లొంగిపోతున్నారని అనుకునే వారికి ఇదే మా హెచ్చరిక అని, మావోయిస్టు పార్టీ ఎప్పటికీ కనుమరుగు అవ్వదని లేఖలో స్పష్టం చేశారు. మావోయిజాన్ని ఎవరూ చంపలేరని, తాము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాము కొంతకాలం బయటకు రాలేమని, కాబట్టి ప్రజల కోసం పనిచేసే మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాలు, మీడియా ప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు మావోయిస్టు ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని లేఖలో కోరారు.
ఈ నెల 31 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పకడ్బందీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదల కావడం స్థానికంగా భయాందోళనలకు దారితీసింది.

