కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మణుగూరు (Manuguru) ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో బస్సు కండక్టర్ తీవ్రంగా గాయపడగా, మరో పది మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మణుగూరు డిపో నుంచి ఖమ్మం వైపు బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు, అశ్వాపురం – జగ్గారం మధ్యకు చేరుకున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, బస్సు ముందు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి దానిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కండక్టర్కు తీవ్ర గాయాలు కాగా, సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసి, మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

