కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు (Manuguru) పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి రాకపోవడంతో వ్యాపారులు ప్రజలను దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో ఒక్కోచోట, ఒక్కో రేటు ఉండటంతో సామాన్యులు వెజ్, నాన్ వెజ్ కొనాలంటేనే హడలెత్తి పోతున్నారు. వ్యాపారులు కూడా ఇష్టారీతిన ధరలు వసూలు చేస్తున్నారు. పట్టణంలో ఉన్న ఏ మార్కెట్లో కూడా ధరల పట్టిక కనపడదు. దీంతో వ్యాపారులు చెప్పిన రేటు వినియోగదారులు చెల్లిస్తున్నారు. అదే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే ధరల పట్టిక తో పాటు, నిరంతర పర్యవేక్షణ కూడా ఉండటంతో దోపిడీ కూడా కట్టడి అవుతుందని ప్రజలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు పట్టణంలో నాన్ వెజ్ ధరలు, పూల మార్కెట్ సెంటర్లో కంటే టీడీపీ సెంటర్లో అధికంగా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రూ.50- 60 వరకూ తేడా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం మండలంలోని ప్రజలు కూరగాయలు, చికెన్, మటన్, చేపలు వేరు వేరు చోట్ల కొనుగోలు చేస్తున్నారు. అదే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే అన్నీ ఒకే దగ్గర కొనుక్కునే వెసులుబాటు ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
మణుగూరు(Manuguru) మండలంలోనీ రాజీవ్ గాంధీ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు 2021 లోనే అప్పటి కేసీఆర్(KCR) ప్రభుత్వం శంకుస్థాపన చేసి బిల్డింగ్ కూడా దాదాపు పూర్తి చేసింది. కానీ ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకూ దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం గమనార్హం. సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేడు నిర్మానుష్యంగా మారింది. దీంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. చెట్ల పొదలు కూడా బాగా పెరిగి రాత్రి పూట అటు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవ తీసుకుని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

