కలం, వెబ్ డెస్క్: పోలవరం (Polavaram) ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకోవడంలో తాము విఫలమయ్యామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ (PVN Madhav) వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) సమీపిస్తున్న నేపథ్యంలో మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతికి నిధులు, రాయలసీమకు కీలక ప్రాజెక్టులు ఇచ్చిందని మాధవ్ చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలంటే గెలిచే శక్తి ఉండాలని, సీట్లు అడగటం ముఖ్యం కాదని మాధవ్ అన్నారు. ముందు ఎన్నికల్లో గెలవగలమన్న నమ్మకాన్ని కలిగించాలని సూచించారు.
2019లో పార్టీ తీవ్ర అవమానాల పాలైందని, ఇప్పుడే మంచి పరిస్థితులు వచ్చాయన్నారు. ఇదే సమయంలో పార్టీ మరో మెట్టు ఎక్కాలని ఆకాంక్షించారు. కూటమిలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇటీవల పీవీఎన్ మాధవ్ పలువురు బీజేపీ నేతలతో కలిసి పోలవరం ప్రాజరెక్టును సందర్శించారు.

