కలం, నల్లగొండ బ్యూరో: సాగర్ ఎడమ కాల్వలో వ్యక్తి గల్లంతయ్యాడు. మిర్యాలగూడ (Miryalaguda) మండలం తడకమళ్ల గ్రామ శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన తమ్మిశెట్టి పెద్ద వెంకన్న (55) తన ఇద్దరు మనువళ్ల (Grandchildren)తో కలిసి స్నానం చేసేందుకు తడకమళ్ల శివారులోని సాగర్ కాల్వకు వెళ్లాడు. మెట్లపై స్నానం చేస్తుండగా తాత, మనువళ్లు ముగ్గరూ కాల్వలో జారిపడ్డారు. ఉధృతిలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న అంకెపాక రాజు, చక్రి సకాలంలో స్పందించి ఇద్దరు పిల్లలను రక్షించారు. వెంకన్న మాత్రం గల్లంతయ్యాడు. వెంకన్న అల్లుడు గుంజా లింగయ్య ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రావులపెంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

