కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ రాష్ట్రం మొహాలీ (Mohali)లో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్లపాటు ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందనే కోపంతో ఒక ఉన్మాది ఆఫీసులోనే అందరి ముందూ ఆమెను దారుణంగా హత్య చేశాడు. మొహాలీలో గల ఒకే కంపెనీలో డింపుల్ (30), హర్జిందర్ సింగ్ (39) సహోద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల హర్జిందర్కు డింపుల్ బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన అతడు కక్ష పెంచుకున్నాడు. తాము పనిచేస్తున్న ఆఫీసులోనే డింపుల్పై ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. భయంతో ఆమె కేకలు వేస్తూ ఆఫీసంతా పరిగెత్తినా వదలకుండా వెంటపడి మరీ దారుణంగా పొడిచాడు. తోటి ఉద్యోగులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డింపుల్ను కాపాడలేకపోయారు. ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. ప్రియురాలిని చంపేసిన అనంతరం హర్జిందర్ సింగ్ అదే కత్తితో తనను తాను పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

