కలం, వెబ్ డెస్క్: అమీర్ పేట్లో మైత్రివనం ఎదురుగా అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పరిశీలించారు. బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ‘అగ్నిప్రమాదం అకస్మాత్తుగా జరిగింది కాదు. వెనుక వైపు ఉన్న మెస్ కారణంగా గతంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని గత 3 నెలలుగా అధికారులకు చెబుతూనే ఉన్నారు. వారు నిర్లక్ష్యం చేయడంతో సుమారు రూ.4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన గంట పావు వరకు కూడా ఫైరింజన్లు రాకపోవటం దారుణం. సరైన సమయానికి వచ్చి ఉంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేది’ అని మండిపడ్డారు.
ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి..
అగ్ని ప్రమాదాలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ‘ప్రమాదం జరిగిన షాప్ వాళ్లందరికీ ప్రభుత్వం అందించిన ఎన్ఓసీలు ఉన్నాయి. వాళ్లందరికీ నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. హైడ్రా సిబ్బంది పరిశీలించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఎండకాలంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల కారణంగా మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, హైదరాబాద్ నగరంలో ఇంకా అనేక చోట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని వివరించారు.

