కాలు విరిగిందని వస్తే.. ప్రాణం పోయింది!

కలం, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వస్తే, చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

మూడు రోజుల కిందట ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన చెట్లపల్లి విజయేందర్ (38) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు విరగడంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యులు విజయేందర్ కాలికి ఆపరేషన్ నిర్వహించారు.

ఆపరేషన్ తర్వాత విజయేందర్ కుటుంబ సభ్యులతో మామూలుగానే మాట్లాడాడు. అయితే గురువారం రాత్రి హఠాత్తుగా ఊపిరితిత్తులకు గాలి అందడం లేదని, అత్యవసర చికిత్స అందిస్తున్నామని చెబుతూ ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యుల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విజయేందర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

కాలు విరిగితే ప్రాణాలు ఎలా పోతాయని మృతుడి బంధువులు ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. మొదట గాలి అందడం లేదని చెప్పిన వైద్యులు, ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ వల్ల మరణించాడని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే విజయేందర్ చనిపోయాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: బ్రేకప్ నుంచి ‘మూవ్ ఆన్’ అవ్వడం ఎలా..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>