కలం, వెబ్ డెస్క్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సమావేశం ముగిసింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ (TPCC) నాయకులు, మంత్రులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాల పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన హామీలన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజా తెలంగాణ దార్శనికతను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అందించాలనే తమ సంకల్పం దృఢంగా ఉందన్నారు. ఇది తమ గ్యారంటీలలో స్పష్టంగా ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు.


