కలం, వెబ్ డెస్క్: సైబరాబాద్ డీసీపీ రీతిరాజ్ (DCP Ritiraj) సాధారణ కస్టమర్ లా ఓ పబ్లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను గుర్తించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లిలో ఉన్న ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్లో శనివారం అర్ధరాత్రి ఆమె వినూత్న రీతిలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి హడావుడి లేకుండా, సెక్యూరిటీ సిబ్బందిని పక్కనపెట్టి సాధారణ కస్టమర్లా పబ్లోకి ప్రవేశించారు.
పబ్లో జరుగుతున్న కార్యకలాపాలను మొబైల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన డీసీపీ వెంటనే స్థానిక పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులు పబ్కు చేరుకుని సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పబ్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, అనుమతులు, కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
డీసీపీ రీతిరాజ్ (DCP Ritiraj) వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారి స్వయంగా కస్టమర్లా వెళ్లి తనిఖీలు నిర్వహించడం అరుదైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పబ్లు, నైట్ లైఫ్ కేంద్రాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుల నిఘా మరింత పెరుగుతుందనే సంకేతాలు ఈ ఘటనతో కనిపిస్తున్నాయి.
Read Also: భయపడడానికి నేను కేసీఆర్ను కాను.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్
Follow Us On : WhatsApp

