కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) భారీ షాక్ ఇచ్చింది. రేపు దిల్లీలో నిర్వహించే సమావేశానికి తాము హాజరు కాబోమని, కూటమి నుంచి వైదొలిగినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే డీఎంకే పార్టీ ఇండియా కూటమికి దూరంగా ఉండగా, ఆప్ కూడా తప్పుకుంది. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం రేపటి సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్డీయే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైన వ్యూహాలపై రేపు చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి దిల్లీ చేరుకున్నారు.
ఆప్ అందుకేనా దూరం..?
ఇండియా కూటమి ఏర్పాటులో ఆప్ కీలక పాత్ర పోషించింది. కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలోనూ కూటమి నేతలు భారీ నిరసన చేపట్టారు. అయితే దిల్లీ ఎన్నికల సమయానికి కథ మారిపోయింది. అప్పటివరకు మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, ఆప్.. ఆ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. అక్కడి నుంచి రెండు పార్టీల మధ్య దూరం పెరిగిపోయి చివరికి ఆప్ కూటమి నుంచే బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. “ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల కోసం ఏర్పడిన ఎన్నికల కూటమి మాత్రమే. ఇప్పుడు మేము దానిలో భాగం కాదు” అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొనడం గమనార్హం.

