కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే, 18 నుండి 23 వరకు నిర్వహించనున్న యువజన క్రీడలు, టూరిజం వారోత్సవాలను లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ భీమ్య నాయక్ ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ మే, 18 నుండి 23 వరకు జిల్లాలో (Mahabubnagar) యువజన క్రీడలు, టూరిజం వారోత్సవాలను నిర్వహించాల్సి ఉందని.. యువజన క్రీడలు, టూరిజం వారోత్సవాలను లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు, సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మే 18వ తేదీన ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమం సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుండి వయా బస్ డిపో పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2 కి.మీ. రన్ ఉంటుంది. యువ టూరిజం క్లబ్ లను జాగృతం చేసే గోడ పత్రిక ఆవిష్కణ ఉంటుంది.
రెండవ రోజు కెరీర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, చారిత్రాత్మక పురాతన కట్టడాల పై అవగాహన కార్యక్రమం ఉంటుంది. మూడవ రోజు యూత్ లీడర్ షిప్ సమ్మిట్, టూరిజం కు సంబంధించి హెరిటేజ్ వాక్, లోకల్ గైడ్ వాలంటీర్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగవరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా పెబ్బేరు లో ఫుట్ బాల్ క్రీడలు నిర్వహించబడును. ఐదవ రోజు యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛదనంకార్యక్రమం ఉంటుంది. ఆరవ రోజు ఉద్యోగ సాధన, టూరిజం బ్రాండ్ కిట్ విడుదల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలను రోజు వారిగా జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి, డి.ఈ.ఓ అబ్దుల్ ఘని, ఇండస్ట్రియల్ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

