కలం, మహబూబ్నగర్, బ్యూరో: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) ఆదివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, ఎఫ్ఐఆర్ నమోదు విధానం, స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్ఎస్ నమోదు విధానం, ఆన్లైన్ అప్డేట్స్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి కేసును సమయానుకూలంగా నమోదు చేసి సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
కేసుల దర్యాప్తులో నాణ్యత పెంపొందించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి కేసుల దర్యాప్తు వరకు ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాలను జిల్లా ఎస్పీ సిబ్బందికి వివరించారు. నిష్పక్షపాత విధులే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీజీపీ సూచించినట్లు తెలిపారు.
అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాలను కూడా జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుదారుతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది బైకులు నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ సిబ్బందే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొంటూ, హెల్మెట్ లేకుండా బైకులపై వచ్చే సిబ్బందిని పోలీస్ స్టేషన్లోకి అనుమతించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం స్టేషన్ సిబ్బందితో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్న సిబ్బంది ప్రతి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి నేరుగా తనను కలవవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా, రూరల్ సీఐ గాంధీ నాయక్, హన్వాడ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

