కలం, మహబూబ్నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. జూన్ 2న కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఏర్పాటు చేస్తున్న కుర్చీలు, నీడ కొరకు ఏర్పాటు చేసిన టెంట్లు, వివిధ ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ప్రదర్శన స్టాళ్లను ఆమె పరిశీలించారు.
ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు
ఈ సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుతున్నారని అన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ద్వారా ఏర్పాటుచేస్తున్న స్టాళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, జిల్లా పరిపాలన అధికారి సువర్ణరాజు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

