కలం, మహబూబ్నగర్ బ్యూరో: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని పాలమూరు (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అటవీ శాఖ రూపొందించిన పోస్టర్ను ఆమె క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి, జీవవైవిధ్యానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని, అందుకే “ప్లాస్టిక్కు నో చెప్పండి.. ప్రకృతికి ఎస్ చెప్పండి” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ స్పూన్లు, కత్తులు, చంచాలు, ప్లాస్టిక్ స్ట్రాల వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత వస్తువులైన జూట్ సంచులు, స్టీల్ బాటిళ్లు, విస్తరాకులు లేదా అడవి ఆకులతో చేసిన ప్లేట్లను మాత్రమే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో మహమ్మదాబాద్ అటవీ రేంజ్ అధికారి అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.

