కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా 180 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విజయవంతంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం), పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), మెప్మా ఆధ్వర్యంలో 22,414 మంది రైతుల నుంచి 1,16,345.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 41,996 మెట్రిక్ టన్నుల సన్న, 74,349.800 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 21,585 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.265 కోట్ల మేర ధాన్యం కొనుగోలు నగదు జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన రైతులకు సంబంధించిన సుమారు రూ.12 కోట్ల చెల్లింపులు కూడా మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అనేక సవాళ్లు ఎదురైనా..
ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేక సవాళ్ల మధ్య కొనసాగినా.. జిల్లా యంత్రాంగం సమన్వయంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేసిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసే పరిస్థితులు ఏర్పడినా, అధికారులు వెంటనే స్పందించి సమీప బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేసి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ధాన్యం నిల్వలో ఆలస్యం జరగకుండా జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ప్రత్యేక అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ధాన్యం నాణ్యతకు సంబంధించి తేమ శాతం, తాలు, నాన్-ఎఫ్ఏక్యూ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రవాణా పరంగా లారీల కొరత కూడా ఒక ప్రధాన సవాలుగా మారినా.. ఆర్టీఓ శాఖ సహకారంతో చెక్పోస్టుల ద్వారా అదనపు లారీలను సమకూర్చి కొనుగోలు కేంద్రాలకు పంపించినట్లు వివరించారు. జిల్లా పౌర సరఫరాల, రెవెన్యూ, వ్యవసాయ, సహకార, పోలీసు, రవాణా శాఖల అధికారుల సాయంతో కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు.

