కలం, మహబూబ్నగర్ బ్యూరో: సోదర సోదరీమణుల పరస్పర ప్రేమ, ఆప్యాయత, గౌరవానికి రక్షాబంధన్ నిదర్శనమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Additional Collector Madhusudan Naiik) అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని యెనుగొండ (Yenugonda) కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ విద్యార్థినులతో కలిసి రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థినులతో కలిసి అల్పాహారం
ఉదయం పాఠశాలకు చేరుకున్న అదనపు కలెక్టర్ విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ విద్య, భవిష్యత్ లక్ష్యాలు, ఆశయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అదనపు కలెక్టర్కు రాఖీలు కట్టిన విద్యార్థినులు
రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా కేజీబీవీ విద్యార్థినులు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్కు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులతో కలిసి అదనపు కలెక్టర్ పండుగ వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారితో కలిసి అల్పాహారం చేయడం పట్ల విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

