కలం, వరంగల్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట (Narsimhulapet) మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడులు సంచలనం సృష్టించాయి. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్ అనుమతి ఇచ్చేందుకు గానూ లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన నర్సింహులపేట ఎంపీడీవో రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ కూడా అధికారులతో పాటు పట్టుబడటం గమనార్హం.
మొత్తం లక్ష రూపాయల డీల్ లో భాగంగా తొలి విడతగా 45 వేల రూపాయల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలోనే ఉంటూ అన్ని రకాల సెటిల్మెంట్లు, అధికారిక వ్యవహారాలు చక్కబెడుతున్న ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తూ, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

