కలం, ఖమ్మం బ్యూరో: “అక్కా..” అనే ఒకే ఒక్క పిలుపులో ఆత్మీయతను వెతుక్కుంటూ గడిచిన 30 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా సోదర భావాన్ని పంచుతోంది ఈ మాదారమ్మ (Madaramma). సమాజంలో కుల, మత వైషమ్యాలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ప్రేమ-ఆప్యాయతలే సరిహద్దులుగా రాఖీ పౌర్ణమి రోజున పలువురికి రాఖీలు కడుతూ, సమైక్యతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన మాదారమ్మ గతంలో కౌన్సిలర్గా, ఆటో యూనియన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారు.
ప్రస్తుతం మున్సిపాలిటీలో తైబజార్ (వీధి వ్యాపారుల దగ్గర పన్ను వసూలు చేసే కాంట్రాక్టర్)గా పనిచేస్తోంది. ప్రతిరోజూ వీధి వీధినా తిరుగుతూ పన్ను వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు, వీధి వ్యాపారులు, ప్రజలు ఆమెను ఆప్యాయంగా “అక్కా” అని పిలుస్తుంటారు.
ఆ పిలుపే తనకు కొండంత బలమని నమ్మే మాదారమ్మ, ప్రతి ఏటా రాఖీ పండుగ నాడు వారందరికీ స్వయంగా రాఖీలు కడుతూ ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఏ హోదాలో ఉన్నా మనుషుల మధ్య ఉండే ఆత్మీయత కంటే మిన్నయినది ఏదీ లేదని చాటుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

